- ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు..?
- అక్రమ ఇసుక డంపింగ్లతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకరా.
- రూ.7 వేలకు ట్రాక్టర్ ఇసుక విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు?
- విచారణ చేపట్టాలని బాధితుడి డిమాండ్.
డోర్నకల్/మరిపెడ, జూలై 9 (నమస్తే న్యూస్): మరిపెడ మండలంలో అక్రమ ఇసుక డంపింగ్లపై రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అధిక ధరలకు విక్రయించడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని యలమంచిలి తండా–ఇటుకలగడ్డ తండాలో భూక్యా నవీన్, అతని బావ దేవా అక్రమంగా ఇసుక డంపింగ్ నిర్వహిస్తూ ట్రాక్టర్ ఇసుకను రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు భూక్యా లలిత రమేష్ నాయక్ ఆరోపించారు. ఇతరులు ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేలకే విక్రయిస్తుండగా తమకూ అదే ధరకు ఇవ్వాలని కోరగా భూక్యా నవీన్ వివాదానికి దిగారని ఆయన తెలిపారు.ఈ విషయమై గతంలోనే మరిపెడ ఎమ్మార్వో కృష్ణవేణికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రమేష్ నాయక్ ఆరోపించారు. యలమంచిలి తండా సర్పంచ్ భద్రు నాయక్, ఉపసర్పంచ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. పైగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను బెదిరిస్తూ, “ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి… ఎవరికీ భయపడేది లేదు” అంటూ హెచ్చరించారని ఆయన ఆరోపించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న సమయంలో ఇసుక ధరలు కృత్రిమంగా పెంచడం వల్ల పేద లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని రమేష్ నాయక్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమ ఇసుక డంపింగ్లను సీజ్ చేయాలని, అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
