- వనదేవతల తీజ్ సంబరాలతో అంబరాన్నంటిన గిరిజన తండాలు.
- ఘనంగా సీత్లా భవాని తల్లి పండుగ.
- గిరిజనులు ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ.
- ప్రకృతిని తలిచే సీతా పండుగ..లంబాడీల తొలి పండుగ ఇదే.
నర్సింహులపేట, జూలై 7 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని మధు తండా, నరసింహాపురం బంజారా గ్రామపంచాయతీ పరిధిలోని లాలి తండాలో లంబాడీల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని తల్లి పండుగను గిరిజనులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వనదేవతల తీజ్ పండుగ సందర్భంగా తండాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.సంప్రదాయ దుస్తులు ధరించిన బంజారా మహిళలు వనదేవతలను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద క్షేమంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రకృతి పచ్చదనంతో కళకళలాడాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.స్థానికంగా “దాటుడు”గా పిలిచే సీత్లా భవాని పండుగ బంజారా సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఏడుగురు కులదేవతల్లో ఒకరైన సీత్లా భవానిని ఆచార వ్యవహారాల ప్రకారం కొలుస్తూ ప్రతి ఏడాది ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.లాలి తండాలో ఏడుగురు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజనులు సంప్రదాయం ప్రకారం గొర్రెపోతును బలి ఇచ్చారు. అనంతరం ఉడికించిన నవధాన్యాలను పశువులపై చల్లి పశుసంపదకు వ్యాధులు రాకుండా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని దేవతలను ప్రార్థించారు.ఈ సందర్భంగా తండాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ గీతాలు, నృత్యాలతో సీత్లా భవాని తల్లి పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవడంతో తండాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో కళకళలాడాయి.


