బీఎల్ఓలకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై శిక్షణ
నర్సింహులపేట, జూలై 7 (నమస్తే న్యూస్)
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్ఓలు) మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తొర్రూరు ఈఆర్ఓ/ఆర్డీఓ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన విధులు, ఓటరు వివరాల ధృవీకరణ, దరఖాస్తుల స్వీకరణ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై బీఎల్ఓలకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి బీఎల్ఓ ఎన్నికల సంఘం సూచనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, ఎన్నికల శాఖ సిబ్బంది, మండల పరిధిలోని బీఎల్ఓలు, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

